sabarimala: శబరిమల ఆలయం తీర్పు: మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన మహిళా న్యాయమూర్తి!

  • మతపరమైన మనోభావాలను అడ్డుకోవడం సరికాదు
  • మతాచారాలలో జోక్యం చేసుకోవడాన్ని రాజ్యాంగం అనుమతించదు
  • ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసులు వేరు

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అనుమతినిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును 4-1 మెజార్టీతో వెలువరించింది. మిగిలిన నలుగురు న్యాయమూర్తుల తీర్పుతో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా ఏకీభవించలేదు. మతపరమైన మనోభావాలను అడ్డుకోకూడదని ఈ సందర్భంగా ఇందు అన్నారు. భారతదేశంలో వేర్వేరు మతాచారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎవరైనా ఒకరు ఏదైనా మతాన్ని పాటించడానికి, గౌరవించడానికి రాజ్యాంగం అనుమతిస్తుందని... అతను లేదా ఆమె నమ్మే, ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవడానికి అనుమతించదని చెప్పారు.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని ఆ రాష్ట్రానికి చెందిన స్త్రీలు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదన్న విషయాన్ని ఇందు మల్హోత్రా ప్రస్తావించారు. అక్షరాస్యత కారణంగా కేరళ మహిళలు సామాజికంగా పురోభివృద్ధిని సాధించారని... వీరిలో ఎక్కువ మంది శబరిమల ఆచరించే ఆచారాల పట్ల వ్యతిరేకతతో లేరని చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులు కోర్టులను ఆశ్రయించారని... అందుకే ఆ కేసులు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ఆ కేసులతో ఈ కేసును పోల్చి చూడరాదని చెప్పారు.

  • Loading...

More Telugu News