kodela: సీఎంల మన్ననలు పొందిన అధికారి..‘నిత్యస్ఫూర్తి’ సాంబశివరావు: ఏపీ స్పీకర్ కోడెల ప్రశంసలు

  • రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ సాంబశివరావుపై పుస్తకం
  • ‘నిత్యస్ఫూర్తి’ని ఆవిష్కరించిన కోడెల
  • విధి నిర్వహణలో రాజీలేనితత్వం ఆయనది

నీతి, నిజాయతీ, నిక్కచ్చితనానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు నిలువెత్తు నిదర్శనమని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి, వారి మన్ననలు అందుకున్న అధికారి ఆయన అని ప్రశంసించారు.

  సాంబశివరావుపై రాసిన ‘నిత్య స్ఫూర్తి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు ఏపీ అసెంబ్లీలోని మొదటి అంతస్తులోని కమిటీ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోడెల శివప్రసాదరావు ప్రసంగిస్తూ, విధి నిర్వహణలో రాజీలేనితత్వం సాంబశివరావుదని, ఆయన ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. ‘నిత్యస్ఫూర్తి’ లోని ప్రతి అక్షరమూ తనను ఎంతో ప్రభావితం చేసిందని, సాంబశివరావు జీవిత విశేషాలను అందించిన ఆ పుస్తక రచయిత రామకృష్ణను అభినందిస్తున్నానని అన్నారు.

ఆరోగ్యమంత్రిగా తాను పని చేస్తున్న సమయంలో సాంబశివరావు ఆ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించేవారని, రాజీలేని ధోరణితో, విమర్శలకు తావు లేకుండా విధులు నిర్వర్తించారని. ఆయన పనితీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఎంతో నిబద్ధతతో వ్యవహరించే వారి జీవిత విశేషాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని కోడెల అన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘాలతో ఎంతో ఉపయోగం కలుగుతుందని, ఏడాదికి ఒకసారైనా పూర్వ విద్యార్థులు కలుసుకోవడం వల్ల తాము జన్మించిన గ్రామంతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతో మేలు కలుగుతుందని కోడెల అభిప్రాయపడ్డారు. తమ గ్రామంలో ఏటా సంక్రాంతికి ‘పల్లెకు పోదాం’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని, దేశ విదేశాల్లో ఉన్నవారందరూ తమ భార్యాబిడ్డలతో సంక్రాంతి రోజున స్వగ్రామానికి వస్తుంటారని చెప్పారు. వారంతా ఇచ్చే విరాళాలతో తమ గ్రామంలో రూ.3 నుంచి 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు.

ప్రభుత్వ శాఖల్లో క్లిష్టమైనవి విద్య, ఆరోగ్యశాఖలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అటువంటి శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా సాంబశివరావు తనదైన ముద్ర వేసుకున్నారని, 8 మంది ముఖ్యమంత్రులతో ఆయన కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రులు ఏ పని అప్పజెప్పినా నిబద్ధతతో ఆయన పూర్తి చేసేవారని, అందుకే, ముఖ్యమంత్రుల మన్ననలు పొందిన అధికారిగా సాంబశివరావు గుర్తింపు పొందారని అన్నారు. కింది ఉద్యోగులకు కూడా ఆయన తన పనితీరుతో మార్గదర్శకంగా నిలిచారని కోడెల కొనియాడారు.

ఆయన పూరిపాకల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. పశువైద్య డాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సాంబశివరావు నేడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు ఆశించాలని స్పీకర్ ఆకాంక్షించారు. బాల్యంలోని కష్టాలు నేటి తీపి గుర్తులుగా ఉంటాయన్నారు. సాంబశివరావు జీవితంలో ఎత్తు పల్లాలు ప్రజలకు, భావితరాలకు తెలియాల్సి ఉందన్నారు. బాల్యంలో విద్యాభ్యాసం కోసం సాంబశివరావు పడిన కష్టాలు 40 ఏళ్లనాటి విద్యా వ్యవస్థను కళ్లకు కడుతున్నాయన్నారు.కష్టపడి పని చేస్తే అద్భుతాలు సాధించవచ్చు

పుస్తక రచనలో తనకు సంబంధించిన వివరాలేవీ తాను అందించలేదని, రచయిత, గొల్లనపల్లి గ్రామస్తులే వివరాలు సేకరించి పుస్తకాన్ని ముద్రించారని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు అన్నారు. చెప్పారు. టీటీడీలో చేపట్టిన సంస్కరణలతో తలనీలాలకు భక్తులు గంటల తరబడి నిలబడాల్సిన కష్టం తప్పిందని, కష్టపడి పని చేస్తే అద్భుతాలు సాధించవచ్చని, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా విధులు చేపట్టే సమయానికి పాస్ బుక్ ల పంపిణీలో అట్టడుగున ఉండేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జిల్లాలో వీఆర్వోలతో కలిసి చిత్తశుద్ధితో పని చేసి రాష్ట్రంలో నెల్లూరును మొదటిస్థానంలో నిలిపామని, ఇలా పని చేసిన అన్ని శాఖల్లోనూ కింది స్థాయి అధికారులతో కలిసి ఆ శాఖల నుంచి ఉత్తమ ఫలితాలు సాధించామని సాంబశివరావు తెలిపారు. అన్ని శాఖల్లోనూ ఉత్తమ అధికారులు ఉంటారని, వారిని ఉత్తేజపర్చడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

భూ సమీకరణ సమయంలో ప్రజల నుంచి ఎంతో వ్యతిరేకత వస్తుందని, తాను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించామని సాంబశివరావు చెప్పారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిబంధనలు రూపొందించామని, దీనివల్ల 33 వేల ఎకరాలకు పైగా భూములను ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించ గలిగామని అన్నారు.

ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనది, సాంబశివరావుది గన్నవరం నియోజకవర్గమేనని, మాటలు తక్కువగా మాట్లాడి పని ఎక్కువగా చేసే అధికారి ఆయన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు, పుస్తక రచయిత రామకృష్ణ,  గొల్లనపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 1974-75 పదో తరగతి విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

More Telugu News