Uttar Pradesh: బాంబులు, తుపాకులతో యూపీలో అధికార పార్టీ నేత ఇంటిపై దాడి!

  • ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఘటన
  • గతంలో ఎమ్మెల్యే సోమ్ కు బెదిరింపులు
  • తాజాగా ఇంటిపై కాల్పులు, గ్రనేడ్ల దాడి

ఉత్తరప్రదేశ్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. చంపేస్తామని సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై బాంబులు విసరడంతో పాటు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది.

మీరట్ లో బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై నిన్న కొందరు దుండగులు విరుచుకుపడ్డారు. రాత్రి 12.45 గంటల సమయంలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని సెక్యూరిటీ పోస్ట్, మెయిన్ గేటుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం ఇంటిపై గ్రనేడ్లు విసిరారు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో పాటు అక్కడకు చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ బుల్లెట్లు, గ్రనేడ్ అవశేషాలను సేకరించింది.

ఈ విషయమై ఎమ్మెల్యే సోమ్ మాట్లాడుతూ.. తనకు రెండేళ్ల క్రితం చంపేస్తామని కొందరు దుండగులు బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

More Telugu News