Shoaib Akhtar: ఏయ్.. ఉతికేస్తాం.. ఊడ్చేస్తాం క్యా హై?.. భారత యాంకర్‌ను హెచ్చరించిన షోయబ్ అక్తర్

  • టీవీ డిబేట్ షోలో యాంకర్‌పై అక్తర్ గుస్సా
  • తానేమీ సాదాసీదా క్రికెటర్‌ను కానన్న అక్తర్
  • పద్ధతిగా మాట్లాడాలని హితవు

ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్ధతిగా మాట్లాడాలని, ఈ చిల్లర మాటలేంటని మండిపడ్డాడు. మీ ముందు కూర్చున్నది సాదాసీదా ఆటగాడు కాదని, కాబట్టి పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికాడు. అక్తర్ ఇంతగా మండిపడడానికి గల కారణాల్లోకి వెళ్తే..

ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు ముందు ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్‌లో షోయబ్ అక్తర్ పాల్గొన్నాడు. ఈ షోలోకి అక్తర్‌ను తొలుత ఆహ్వానించిన యాంకర్.. అనంతరం అక్తర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ దేశం (భారత్)లో రెండో విడత ‘స్వచ్ఛ భారత్’ కూడా ప్రారంభమైందని, చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని టీమిండియా ఆటగాళ్లు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. పాకిస్థాన్‌ను ఇప్పటికే ఉతికి ఆరేశారని, మళ్లీ ఈ రోజు అందుకు మీ ఆటగాళ్లు సిద్ధపడ్డారా? అని ప్రశ్నించింది.

యాంకర్ మాటలతో షోయబ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఏంటా మాటలంటూ విరుచుకుపడ్డాడు. మీరెవరో నాకు తెలియకపోయినా చాలా గౌరవం ఇస్తున్నానని పేర్కొన్న అక్తర్, తనతో పద్ధతిగా మాట్లాడాలని సూచించాడు. ఈ ‘ఉతికేస్తారు’, ‘ఊడ్చేస్తారు’ వంటి పదాలేంటని అంతెత్తున లేచాడు. అటువంటి ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనని, తనను కేవలం క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని సూచించాడు.

షోయబ్ ఆగ్రహంతో యాంకర్ సర్దుకుని.. భారత్-పాక్ మధ్య జరిగిన గత మ్యాచ్ ఏకపక్షంగా సాగిందని, మరి నేటి మ్యాచ్‌లో ఎటువంటి ప్రణాళికతో పాక్ జట్టు వస్తోందని ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నలకైతే తాను సమాధానం చెబుతానన్న అక్తర్.. మీ ముందు కూర్చున్నది ఎవరో హరియాణా క్లబ్ క్రికెటర్ కాదని, కాబట్టి ఉతికేస్తాం, చించేస్తాం వంటి పదాలు మరోమారు వాడొద్దని పేర్కొంటూ సమాధానాలు ఇచ్చాడు. కాగా, అక్తర్ సహనం కోల్పోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News