Rafel: జైట్లీ అబద్ధాలు చెప్పడం మాని రాఫెల్‌ కుంభకోణంలో వాస్తవాలు బయటపెట్టాలి : రాహుల్‌గాంధీ

  • మీరు అసత్యాలు తిప్పిచెప్పడంలో సమర్థులే...కాదనం
  • కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిఉంది
  • జేపీసీ ఏర్పాటును డిమాండ్‌ చేసిన మనీష్‌ తివారి

"మనం ఏం చేసినా, ఎలా చేసినా అడిగేవారుండకూడదు...నిలదీసే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయాలి... ఇది ప్రధాని మోదీ రాజకీయ చాతుర్యం. ఇందుకు అసత్యాలను కూడా తిప్పిచెప్పగల సమర్థుడైన మంత్రి జైట్లీతో కథ నడిపిస్తున్నారు" అంటూ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాఫెల్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ ఆరోపణలపై జైట్లీ చేసిన ప్రత్యారోపణల నేపథ్యంలో రాహుల్‌ ట్విట్టర్‌లో స్పందించారు.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరగలేదని జైట్లీ చెప్పడం అబద్ధాన్ని తిప్పిచెప్పడమేనని ఎద్దేవా చేశారు. సమర్థించుకోవడానికి వీల్లేని విషయాలను కూడా అరుణ్‌జైట్లీ సమర్థించగలరు. కాదనను...కాని ఇప్పటికైనా అబద్ధాలను చెప్పడం మానుకుని కుంభకోణంలో వాస్తవాలు బయటపెట్టాలని ఆయన సూచించారు.

ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మనీష్‌ తివారి, మల్లికార్జున ఖర్గే, రణదీప్‌ సుర్జేవాలాలు కూడా జైట్లీ వ్యాఖ్యలపై స్పందించారు. వివాదాస్పద ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వేయాలని మనీష్‌ తివారి కోరారు. 'విపక్షాలపై దాడికే మోదీ మిమ్మల్ని మంత్రివర్గంలో కొనసాగించవచ్చు కానీ, మీ ఉపన్యాసాలు సామాన్యుడి కడుపునింపవు, వాస్తవాలు బయటపెట్టండి' అని ఖర్గే డిమాండ్‌ చేశారు. మరోవైపు కుంభకోణంలో ఉన్నమంత్రులెవరూ తప్పించుకోలేరని రణదీప్‌ సుర్జేవాలా ఘాటుగా హెచ్చరించారు. జేపీసీ వేయాల్సిందేనని సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేశాయి. 

More Telugu News