Arun Jaitly: రాఫెల్‌పై రాద్ధాంతానికి రాహుల్‌, హోలాండే మధ్య డీల్ : అరుణ్ జైట్లీ

  • నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కూడబలుక్కుని ఆరోపణలు
  • ఆగస్టు 30న కాంగ్రెస్‌ చీఫ్‌  ట్వీట్‌ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి
  • ‘రెండు వారాల్లో ఫ్రాన్స్ బాంబులు పేలనున్నాయి’ అని దాని సారాంశం

నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఏదో రూపంలో బదనాం చేసి ప్రయోజనం పొందాలని ఆశిస్తున్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హోలాండేతో చేతులు కలిపినట్లున్నారని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇద్దరూ కూడబలుక్కునే మోదీ సర్కార్‌పై దుష్ప్రచారానికి సిద్ధమైనట్లుందని విమర్శించారు. జైట్లీ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. రాఫెల్‌ డీల్‌పై స్పందించాలని కోరగా ఈ విధంగా అన్నారు. ‘ఆగస్టు 30న రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. రాబోయే రెండు వారాల్లో  ఫ్రాన్స్ లో కొన్ని బాంబులు పేలనున్నాయని దాని సారాంశం. అంటే ఇది ప్రణాళికాబద్ధంగా లేవనెత్తుతున్న వివాదమనేగా అర్థం’ అని జైట్లీ స్పష్టం చేశారు.

రాహుల్‌ గాంధీ ట్వీట్‌కు, హోలాండే వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యల తర్వాత జరిగిన కోలాహలంలో ఏకీభావం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను వ్యాఖ్యానించిన మరునాడే హోలాండే వెనక్కి తగ్గడానికి కారణం ముందు ప్రేరేపిత వ్యాఖ్యలే కారణమన్నారు. భారత ప్రభుత్వమే రిలయన్స్‌ డిఫెన్స్‌ను సూచించిందని, తమకు మరో అవకాశం లేకుండా పోయిందని ఈనెల 21న వ్యాఖ్యానించిన హోలాండే మరునాడు మాట మార్చారు. రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఆప్‌సెట్‌ పార్టనర్‌గా ఎంపిక చేసుకోవాలని భారత్‌ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా? లేదా అన్న విషయం తనకు తెలియదని, డసాల్ట్‌నే అడగండని అనడం గమనార్హం.

More Telugu News