Hyderabad: మందు కొడుతున్నాడని యువకుడిని మేడపై నుంచి తోసేశాడు!

  • అపార్ట్ మెంట్ ఓనర్ కుమారుడి నిర్వాకం
  • హైదరాబాద్ లోని నారాయణగూడలో ఘటన
  • మద్యం తాగడాన్ని సహించలేక దారుణం

ఇల్లు అద్దెకు ఇచ్చాక చాలా విషయాల్లో ఓనర్ తో మాటలు వస్తుంటాయి. కొందరు వీటిని సర్దుకుపోతే, మరికొందరేమో ఇల్లు ఖాళీ చేసేస్తారు. ఇలా ఖాళీ చేసే సమయాల్లో కొన్నిసార్లు ఓనర్లు, అద్దెకు దిగినవారికి తీవ్రమైన గొడవలు కూడా జరుగుతుంటాయి. తాజాగా తమ అపార్ట్ మెంట్ లో అద్దెకుంటున్న వ్యక్తి మద్యం తాగడం నచ్చని ఓనర్ కుమారుడు అతడిని మేడపై నుంచి తోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నారాయణగూడలో సంజు అనే యువకుడు ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సంజుకు మద్యం అలవాటు ఉండటంతో  రోజూ మందు తెచ్చుకుని తాగేవాడు. దీనిపై ఓనర్ కుమారుడు బస్వంత్ తో సంజుకు గొడవ జరిగింది. సంజు నాలుగో అంతస్తు వద్ద ఉండగా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో బస్వంత్ సహనం కోల్పోయాడు. అక్కడి నుంచి సంజును బలంగా తోసేశాడు. దీంతో నాలుగు అంతస్తుల ఎత్తునుంచి నేలపై పడిపోయిన సంజు తలకు బలమైన గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News