Vijayawada: వీడిన విజయవాడ పరువు హత్య పోస్టర్ల మిస్టరీ!

  • సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు
  • సోని రాహు ప్రియలు పరువు హత్యకు గురవుతారని హెచ్చరిక
  • మిస్టరీని ఛేదించిన పోలీస్ అధికారులు

విజయవాడలోని సత్యనారాయణపురంలో నిన్న గోడలపై పరువు హత్య పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. ఇక్కడి శివాలయం వీధుల్లోని గోడలపై ‘సోని రాహు ప్రియ’లు పరువు హత్యకు గురవుతారని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించడం కలకలం సృష్టించింది. దీని గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మిర్యాలగూడ పరువుహత్య నేపథ్యంలో ఎవరినైనా బెదిరించేందుకు ఈ పోస్టర్లను అంటించారా? అన్న కోణంలోనూ విచారణ ప్రారంభించారు.

తాజాగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. పోస్టర్లను అతికించిన యువకుడిని పట్టుకున్నారు. అతడిని చిట్టి లక్ష్మినారాయణగా గుర్తించారు. అతడిని ఈ ‘సోని రాహు ప్రియ’లు ఎవరిని ప్రశ్నించగా.. అతను తీరిగ్గా.. సోనియాగాంధీ-రాహుల్ గాంధీ-ప్రియాంకా గాంధీ’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతయింది. చివరికి ఆ యువకుడికి మతిస్థిమితం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

More Telugu News