Love Marriage: 'మమ్మల్ని చంపేస్తారేమో' అంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట!

  • ప్రేమ వివాహం చేసుకున్న జంట
  • కులాలు వేరు కావడంతో పెద్దల బెదిరింపులు
  • కౌన్సెలింగ్ చేసి పంపిన పోలీసులు

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట, తమ పెళ్లిని పెద్దలు అంగీకరించడం లేదని, తమను చంపేస్తారన్న భయం నెలకొని ఉందని చెబుతూ, పోలీసులను ఆశ్రయించిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగర పరిధిలోని శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బిందు మాధవి, మల్కాపురంలోని సెయింట్‌ ఆన్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతూ, అమె ఇంటి సమీపాన ఉన్న సతీష్‌ కుమార్‌ తో ప్రేమలో పడింది. ఇద్దరి కులాలూ వేరు కావడంతో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. ఒకరిని ఒకరు విడిచివుండలేని వారిద్దరూ, ఈ నెల 20న అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు.

అపై శనివారం నాడు వధూవరులు స్వస్థలానికి రాగా, ఇరువురి తల్లిదండ్రులు వారిని బెదిరించి, వేరుచేయాలని చూడటంతో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను అశ్రయించారు. ఈ మేరకు, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ ఫకీరప్పను కలిసి వినతిపత్రం అందించారు. వారిద్దరికీ అభయమిచ్చిన ఫకీరప్ప, ఇరువురి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు, ప్రేమజంటకు ఏం జరిగినా మీదే బాధ్యతంటూ హెచ్చరించి పంపారు.

More Telugu News