tatikonda rajaiah: కంటతడి పెట్టిన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

  • పవిత్రమైన వైద్య వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చా
  • సొంత పార్టీవారే అప్రతిష్టపాలు చేస్తున్నారు
  • అభివృద్ధిలో నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉంది

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి స్థానికుడే ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. 40 ఏళ్లుగా స్థానికేతరులే నియోజకవర్గాన్ని ఏలుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో... పవిత్రమైన వైద్య వృత్తిని వదులుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు.

ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి, 2014 ఎన్నికల్లో గెలిచానని... ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. తనకు పదవి పోయిందన్న బాధ కన్నా... మన నియోజకర్గానికే మళ్లీ అదే పదవి (డిప్యూటీ సీఎం.. కడియం శ్రీహరి) దక్కిందనే ఆనందంలో తాను ఆనాడు ఉన్నానని చెప్పారు.

అయితే, ఇప్పుడు సొంత పార్టీకి చెందినవారే తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓపక్క అభివృద్ధిలో నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ... మరోపక్క ఎలాంటి అభివృద్ధి చెందలేదని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ద్వారా కాంట్రాక్టు పనులు, పదవులు, సబ్సిడీ ట్రాక్టర్లు పొందినవారే ఇలా దిగజారి మాట్లాడుతుండటం ఆవేదన కలిగిస్తోందంటూ కంటతడి పెట్టారు. 

More Telugu News