Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు.. దోషిగా తేలితే ఏడేళ్ల జైలు శిక్ష

  • సీఎస్ పై దాడి చేశారని ఆరోపణ
  • కేజ్రీవాల్ తో పాటు మరో 12 మందికి సమన్లు
  • మోదీ ప్రభుత్వ అసహన ఫలితమే ఈ సమన్లు అన్న ఆప్

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా ఆప్ నేతలు తనపై దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలకు పటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో దోషులుగా తేలితే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ కేసులో 3000 పేజీల ఛార్జిషీట్‌ను నేడు ఢిల్లీ పోలీసులు కోర్టుకు అందించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేజ్రీ, సిసోడియాలతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేసింది. వీరంతా అక్టోబర్ 25లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ చార్జిషీట్‌ను ఆప్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని... మోదీ ప్రభుత్వ అసహన ఫలితమే ఈ ఛార్జిషీట్‌ అని ఆరోపించింది.

More Telugu News