Tamilnadu: ఇంట్లోనే వ్యభిచారం ప్రారంభించిన తండ్రిని హత్యచేసిన తనయుడు!

  • తమిళనాడు మక్కల్ జిల్లాలో ఘటన
  • భార్యా బిడ్డలను తరిమేసి దందా
  • ఆగ్రహంతో హత్య చేసిన కుమారుడు

ఇంట్లోని కుటుంబ సభ్యులను బయటకు తరిమేసి, ఇతర స్త్రీలను తెచ్చి వ్యభిచార దందాకు తెరలేపిన ఓ తండ్రి ఆగడాలను భరించలేక, తనయుడే హత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని మక్కల్ జిల్లా సేదమంగళంలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పోలుకురిచ్చిలో పెరియసామి, మణిమేఖలై దంపతులు నివాసం ఉంటుండగా, వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే పెరియసామి, నిత్యమూ తాగివచ్చి భార్యా బిడ్డలతో గొడవ పడుతుండేవాడు. తాగవద్దని చెప్పే కుమారులను చితక బాదుతుండేవాడు. ఈ క్రమంలో భార్యను, పిల్లలనూ ఇంటి నుంచి తరిమేసిన పెరియసామి, డబ్బు కోసం మహిళలను ఇంటికి తెచ్చి దందా ప్రారంభించాడు.

ఈ క్రమంలో నిన్న ఉదయం ఇంటి తలుపులు తెరచి వుండటం, లోపలి నుంచి అలికిడి లేకపోవడంతో స్థానికులు పోలీసులకు విషయం చేరవేశారు. వారు వచ్చి చూసేసరికి కత్తిపోటు గాయాలతో పెరియసామి మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్యా, కుమారులను విచారించగా, తన తండ్రిని తానే హత్య చేసినట్టు కుమారుడు అజిత్ వెల్లడించాడు. తాను ఇంటికి వెళ్లేసరికి వ్యభిచారిణులతో ఉల్లాసంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక కోపంతో తండ్రిపై దాడి చేశానని వెల్లడించడంతో, అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News