Telangana: ప్రేమించుకున్నారు... మనస్పర్థలతో ప్రాణం తీసుకున్నారు.. బావామరదళ్ల విషాదాంతం!

  • బావపై కోపంతో ఫోన్‌ కట్ చేసిన మరదలు
  • మనస్తాపానికి గురైన ప్రియుడు ఉరివేసుకుని ఆత్మహత్య
  • కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

క్షణికావేశం...అపోహలు...మనస్పర్థలు ఓ యువజంట విషాదాంతానికి కారణమయ్యాయి. ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటై జీవితాన్ని పంచుకోవాలని కలలుగన్న బావామరదళ్లు చిన్నపాటి వివాదానికే పట్టుదలకు పోయి బలవంతంగా తనువు చాలించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండం టంగటూర్‌ గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలివి.

గ్రామానికి చెందిన సురగళ్ల ఎల్లేష్‌ (22) గచ్చిబౌలీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తన మేనత్త కుమార్తె లావణ్య(19)తో ప్రేమలోపడ్డాడు. ఈ విషయం ఇద్దరి కుటుంబాల్లోని పెద్దలకు తెలియదు. ఆదివారం ఎల్లేష్‌ స్నేహితులతో కలిసి మద్యం తీసుకున్నాడు. అనంతరం లావణ్యతో ఫోన్‌లో మాట్లాడే సమయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. ఎల్లేష్‌ మాటలతో మనస్తాపానికి గురైన లావణ్య ఫోన్‌ కట్‌చేసింది.

దీంతో ఆ బాధలో ఇంటికి వెళ్లిన ఎల్లేష్‌ కుటుంబ సభ్యులతోనూ గొడవపడ్డాడు. అనంతరం బయటకు వెళ్లిపోయి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు ‘నేను తనువు చాలిస్తున్నాను’ అంటూ ముగ్గురు స్నేహితులకు చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఎల్లేష్‌ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు వెతగ్గా పొలంలో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. మేనల్లుడి మరణవార్త విని మేనత్త కుటుంబం ఘటనా స్థలికి వెళ్లింది.

దీంతో ఇంట్లో వున్న లావణ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే చనిపోయింది. ఈ హఠాత్పరిణామంతో రెండు కుటుంబాలు తీవ్రవిషాదంలో మునిగిపోయాయి. వీరి మరణానికి మనస్పర్థలేనా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తెలియరాలేదు. ఎల్లేష్‌ తండ్రి సత్తెయ్య, లావణ్య సోదరుడు రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News