amrutha: కులం, మతం ఎక్కువని భావించే వారికే ఈ లేఖ: మంచు మనోజ్

  • పరువుహత్యలకు కులాలను, మతాలను ప్రేమించేవారే కారకులు 
  • మనుషుల జీవితాల కంటే మీకు కులాలే ఎక్కువా?
  • తండ్రిని స్పర్శించక ముందే.. బిడ్డకు తండ్రే లేకుండా చేశారు
  • మనుషులంతా ఒకటే అనే విషయం ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది?

తన కూతురు అమృత తమ కంటే తక్కువ కులం వ్యక్తి ప్రణయ్ ని ప్రేమించి, పెళ్లాడిందనే కక్షతో ఆమె తండ్రి పరువుహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన ఈ హత్యోదంతంపై సినీ నటుడు మంచు మనోజ్ భావోద్వేగంతో ట్విట్టర్ ద్వారా ఓ లేఖను రాశాడు.

"మానవత్వం కంటే కులం, మతమే ఎక్కువని భావించే వారికే ఈ లేఖ.

సినీ పరిశ్రమ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కాలేజ్ యూనియన్లు కానీ, కుల లేదా మత సంఘాలు కానీ, మరే రంగమైనా కానీ... క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా దారుణం. ప్రణయ్ తో పాటు మరెందరినో బలిగొన్న ఈ దారుణాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వారే కారణం. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా?

మన అందరికీ ఒకేలాంటి గుండె, శరీరం ఉన్నాయి. మనం పీల్చే గాలి కూడా ఒక్కటే. కానీ, కులం, మతం పేరుతో మరొకరి పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కుల ప్రేమికులను, మద్దతుదారులను చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. కుల వివక్ష నశించాలి. ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి. మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక విన్నపం. మన చిన్నారులకు మంచి భవిష్యత్తును అందిద్దాం.

అమృత పరిస్థితి నన్ను ఎంతగానో కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్విట్టర్ ద్వారా మనోజ్ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు. 

More Telugu News