Mohanlal: అలా అడగటానికి నీకు సిగ్గులేదా?: విలేకరిపై మోహన్ లాల్ ఆగ్రహం!

  • వెల్లింగ్టన్ ను సందర్శించిన మోహన్ లాల్
  • క్రైస్తవ నన్ పై అత్యాచారాన్ని ప్రస్తావించిన మీడియా
  • ఆగ్రహంతో క్లాస్ పీకిన మలయాళ సూపర్ స్టార్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కోపం వచ్చింది. ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వెల్లింగ్టన్ ద్వీపానికి ఆయన వెళ్లిన వేళ, సందర్భంలేని ప్రశ్నను అడిగిన మీడియా ప్రతినిధిపై మోహన్ లాల్ అంతెత్తున లేచారు. అటువంటి ప్రశ్న అడగటానికి సిగ్గుగా లేదా? అని విరుచుకుపడ్డారు. కేరళలో ఇటీవల ఓ క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేస్తూ, దానిపై స్పందించాలని సదరు విలేకరి కోరడమే మోహన్ లాల్ కు కోపం తెప్పించింది.

 "ఇటువంటి సమయంలో అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నారు. సిగ్గుగా లేదా? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి, రేప్ ఘటనకు సంబంధం ఏంటి? వరదల గురించి, ప్రకృతి విపత్తు గురించి ప్రశ్నలు అడగవచ్చు కదా? నేను మంచి విషయాలపై మాట్లాడుతున్న వేళ, మీరు అత్యాచారాలను ప్రస్తావించడం ఏంటి? నేను వచ్చిన పనికి, క్రైస్తవ సన్యాసినులకు సంబంధం ఏమైనా ఉందా?" అంటూ మోహన్ లాల్ విరుచుకుపడ్డారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో పాల్గొనకుండానే మోహన్ లాల్ వెళ్లిపోవడం గమనార్హం.

More Telugu News