Miryalaguda: 'ప్రణయ్ ని చంపేశారు' అని చెబితే, 'సరిగ్గా వినపడ్డం లేదు...' అని అమృతతో అన్న మారుతీరావు!

  • ఆసుపత్రి ముందు ప్రణయ్ పై దాడి
  • తండ్రికి వెంటనే ఫోన్ చేసిన అమృత
  • ఫోన్ కట్ చేసిన మారుతీరావు

మిర్యాలగూడలో ఆసుపత్రి ముందు తన భర్త ప్రణయ్ పై దాడి జరిగిన వేళ, ఆ విషయాన్ని తండ్రికి ఫోన్ లో చెబితే, ఆయన పట్టించుకోలేదని అమృత వర్షిణి విలపిస్తూ వెల్లడించింది. ఈ ఘటన జరగడానికి నిమిషం ముందు కూడా తాను తండ్రికి ఫోన్ చేశానని, అప్పుడాయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని వెల్లడించిన అమృత, ప్రణయ్ కిందపడిపోయిన తరువాత, భయంతో ఆసుపత్రిలోకి పరిగెత్తుకు వెళ్లి, మళ్లీ తండ్రికి ఫోన్ చేశానని గుర్తు చేసుకుంది.

తాను ఏడుస్తూ జరిగినదంతా చెప్పగా, ఆయన సరిగ్గా వినిపించడం లేదని అంటూ, తనను ఆసుపత్రిలోకి వెళ్లాలని సలహా ఇచ్చి, ఫోన్ కట్ చేశాడని చెప్పుకొచ్చింది. తమను డాడీ మనుషులు ఫాలో అవుతున్నారని తెలుసుకానీ, ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని, ఆసుపత్రికి రాకున్నా ప్రణయ్ బతికుండేవాడేమోనని అమృత కన్నీటిపర్యంతమైంది.

More Telugu News