Chandrababu: కేసీఆర్ ను కూడా ఉసిగొల్పుతున్నారు.. మోదీకి నీతి ఎక్కడుంది?: చంద్రబాబు

  • జగన్ పై మోదీ ఈగ కూడా వాలనీయడం లేదు
  • అన్యాయాన్ని ప్రశ్నిస్తే కక్షసాధింపులకు పాల్పడుతున్నారు
  • వైసీపీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టే

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నందుకు కక్షసాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వారెంట్ జారీ చేశారని... ఇలాంటి నోటీసులకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా తనపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. తాను ఘోరాలు చేయలేదని, నేరస్తుడిని కాదని చెప్పారు.

ప్రధాని మోదీకి నీతి ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ పై మోదీ ఈగ కూడా వాలనీయడం లేదని మండిపడ్డారు. అవినీతిపరులకు బీజేపీ మద్దతు పలుకుతోందని విమర్శించారు. వైసీపీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందేనని ఆకాంక్షించారు. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, సాగర్ ఎగువన లిఫ్టులను ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీటిని ఇస్తామని చెప్పారు. వర్షాలు లేకపోయినా... వరదనీటితో ప్రాజెక్టులను నింపిన ఘనత టీడీపీదని తెలిపారు.

More Telugu News