Murder: 33 మందిని చంపడానికి పరోక్షంగా మా నాన్నే కారణం!: హంతకుడు ఆదేశ్

  • 33 మంది ట్రక్కు డ్రైవర్లను హత్య చేసిన ఆదేశ్
  • తన క్రూరత్వానికి కన్నతండ్రే కారణమని వెల్లడి
  • ఆదేశ్ చెప్పేవి నమ్మశక్యంగా లేవంటున్న పోలీసులు

 33 మందిని హత్య చేసిన ఓ నిందితుడు పోలీసుల విచారణలో నివ్వెరపరిచే విషయాలను వెల్లడించాడు. ఆదేశ్ అనే దర్జీ ఎనిమిదేళ్లలో 33 మంది ట్రక్కు డ్రైవర్లను హత్య చేశాడు. అతడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్జీగా పని చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక, ఇంకా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ హత్యలు చేసినట్టు ఆదేశ్‌ పోలీసులకు వెల్లడించాడు.

అయితే తన క్రూరత్వానికి తన కన్నతండ్రే కారణమని, ఆయన ప్రేమాప్యాయతలు చూపకపోవడం వల్లే తానలా తయారయ్యానని తాజా విచారణలో వెల్లడించాడు. చిన్నప్పుడు తన తండ్రి ఎప్పుడూ దండిస్తూ ఉండేవాడని, చిన్న చిన్న విషయాలకు కూడా కొట్టి ఇంటి నుంచి గెంటేసేవాడని, ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని తెలిపాడు. దీంతో తాను కోపంతో రగిలిపోయేవాడినని, అందుకే అంత కసాయిగా మారానని పోలీసులకు ఆదేశ్ చెప్పాడు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ఆయా ట్రక్కు డ్రైవర్లను లిఫ్ట్ అడిగేవాడినని, ఎక్కాక మెల్లిగా వారిని కబుర్లలో దింపి, తర్వాత మధ్యలో మద్యం తాగించి, వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి వాళ్ల దగ్గరున్న డబ్బు దోచుకుపోయే వాడినని వివరించాడు. అయితే అతను చెప్పేవి అంత నమ్మశక్యంగా లేవని, వాటిపై విచారణ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News