subrahmanian swamy: అది తిరుగులేని వాస్తవం.. జైట్లీపై బాంబ్‌ పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి!

  • లండన్‌ వెళ్లే ముందు జైట్లీతో మాల్యా చర్చించడం నిజమే 
  • లిక్కర్‌ కింగ్‌పై లుక్‌ అవుట్‌ నోటీసులో పదాలు మార్పించారు
  • అందుకే మాల్యా దర్జాగా దేశం విడిచి వెళ్లిపోగలిగాడు

‘మూలిగే నక్కపై తాటిపండు పడడం’ అంటే ఇదేనేమో. తాను లండన్‌ వెళ్లే ముందు రుణాల చెల్లింపు విషయమై జైట్లీతో చర్చించానంటూ మాల్యా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో, బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబ్‌ పేల్చారు. తాను లండన్‌ వెళ్లిపోతున్నట్లు జైట్లీకి మాల్యా చెప్పడం ‘తిరుగులేని వాస్తవం’ అంటూ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీని, పార్టీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీని మరింత ఇరకాటంలో పడేశాయి.

విజయమాల్యాపై విడుదలైన లుక్ అవుట్‌ నోటీసును బలహీనపరిచింది కూడా నిజమేనని స్వామి కుండబధ్దలు కొట్టారు. ‘2015 అక్టోబర్‌ 24న జారీ అయిన లుక్ అవుట్‌ నోటీసులో ‘పట్టుకోండి’ అనే పదాన్ని ‘సమాచారం చెప్పండి’ అంటూ మార్చడం వల్లే మాల్యా 54 లగేజీ బ్యాగులతో దర్జాగా దేశం విడిచి వెళ్లిపోయేందుకు వీలైందని స్వామి అన్నారు. లండన్‌ వెళ్లిపోతున్నట్లు జైట్లీకి మాల్యా చెప్పడం వాస్తవమని స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. లుక్ అవుట్‌ నోటీసులో పదం మార్చమని ఎవరో చెప్పినట్లు తనకు తెలిసిందని, ఆ వ్యక్తి ఎవరని స్వామి ప్రశ్నించారు. 

More Telugu News