modi: మోదీ ప్రభుత్వం అన్ని పరిమితులను దాటేసింది.. దేశాన్ని కాపాడేందుకు మేమంతా ఏకమయ్యాం!: మన్మోహన్ సింగ్

  • దేశ ప్రయోజనాలు, ఐక్యతకు విఘాతం కలిగించే పనులు చాలా చేశారు
  • దేశ ఐక్యతను కాపాడేందుకు విపక్షాలు ఏకమయ్యాయి
  • మోదీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి

బీజేపీ అన్ని పరిమితులను దాటేసిందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. దేశ ఐక్యతకు, ప్రయోజనాలకు భంగం కలిగించే ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వం చేసిందని విమర్శించారు. మోదీ పాలనలో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ బంద్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ ఐక్యతను, శాంతిని కాపాడటం కోసం విపక్ష పార్టీలన్నీ ఒక చోటకు చేరాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే క్రమంలో విపక్షాలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ఒకటి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అన్ని పార్టీలు తమ పాత సమస్యలను పక్కన పెట్టేశాయని, ఇప్పుడు ఐక్యంగా కలసి ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయని మన్మోహన్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన భారత్ బంద్ కు విపక్షంలో ఉన్న దాదాపు 21 పార్టీలు మద్దతు ప్రకటించాయి. పతనమవుతున్న రూపాయి విలువ, ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలను నిరసిస్తూ విపక్షాలు భారత బంద్ ను చేపట్టాయి. 

More Telugu News