Pakistan: ఇమ్రాన్ స్పందించారు.. మీరూ స్పందించండి!: ప్రధానికి సిద్ధూ విజ్ఞప్తి

  • గురునానక్‌ జయంతికి కర్తాపూర్‌ కారిడార్లు తెరవడంపై ప్రశంసల జల్లు
  • పంజాబీలు ఎంతో ఆనందించాల్సిన విషయమిదని వ్యాఖ్య
  • భారత ప్రభుత్వం స్పందించాల్సిన సమయమిదేనని సూచన

భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నవంబర్‌లో జరిగే గురునానక్‌ జయంత్యుత్సవం సందర్భంగా పాకిస్థాన్‌లోని కర్తాపూర్‌ సాహిబ్‌ కారిడార్లు తెరవాలన్న నిర్ణయాన్ని అభినందించారు. ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు తనకు మాటలు చాలడం లేదన్నారు. ‘పంజాబ్‌ ప్రజలకు ఇంతకు మించిన ఆనందం కలిగించే అంశం మరొకటి ఉండదు, భారత ప్రభుత్వం కూడా ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు.

‘మత రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు. అటువైపు నుంచి ఓ ప్రయత్నం జరిగింది. మీరూ స్పందించండి’ అని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లను కోరారు. ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తీవ్ర విమర్శల పాలైన సిద్ధూ వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదని దీంతో రుజువైంది. ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నాయకుడి వెనుక కూర్చోవడం, పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడం వంటి చర్యలతో బీజేపీ నుంచే కాక సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.

More Telugu News