ap cs: నాణ్యతతో కూడిన మామిడిపండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోవాలి: ఏపీ సీఎస్

  • కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి
  • పెద్దఎత్తున ఎగుమతి చేయాలి
  • ఉలవపాడును ప్రధాన క్లస్టర్ గా అభివృద్ధి చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాణ్యమైన మామిడిపండ్ల ఉత్పత్తి, వాటి ఎగుమతికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఉలవపాడు మామిడి తోటల క్లస్టర్ అభివృద్ధికి సంబంధించి జాతీయ హార్టీ కల్చర్ బోర్డు కో-ఆర్డినేషన్ సమావేశం ఈరోజు జరిగింది. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నుండి నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి వాటిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు వివిధ రకాల మామిడి పండ్లకు ప్రసిద్ధి గాంచిందని, దానిని ఒక ప్రధాన క్లస్టర్ గా అభివృద్ధి చేసి పెద్దఎత్తున మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకుగాను జాతీయ హార్టీకల్చర్ బోర్డు అందించే నిధులను వినియోగించుకోవడంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించి ఈ పండ్లతోట అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉలవపాడు మైదాన ప్రాంతంలో ఉన్నందున అక్కడ మామిడి తోటల పెంపకానికి తగిన నీటి వసతికి అంతగా ఇబ్బంది ఉండదని, అయినప్పటికీ అవసరమైన నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు పడిన ప్రతినీటి బొట్టును పరిరక్షించుకుని భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలని దినేష్ కుమార్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మామిడిపండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్నందున వాటిని నిల్వ చేసేందుకు తగిన స్టోరేజి గోదాములు, లేబొరేటరీ సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ హార్టీకల్చర్ బోర్డును, ఏపీ ఎక్స్ పోర్టు డెవలప్ మెంట్ అథారిటీకి సూచించారు. మామిడి పండ్ల నాణ్యత సరిగాలేవని ఎన్ని కన్సైన్మెంట్లు తిరస్కరణకు గురైంది పరిశీలించాలని, ఉద్యానవన శాఖ కమిషనర్ ను ఆదేశించారు. మామిడిపండ్లకు సంబంధించి పోస్టు హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సేంద్రీయ విధానాన్ని రైతులు అవలంబించేలా ప్రోత్సహించాలని, అదే విధంగా ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయని వాటిపై క్షేత్రస్థాయి రైతాంగం అందరికీ పూర్తి అవగాహన కలిగించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కలిగించాలని చెప్పారు. ఉలవపాడు మామిడితోటల క్లస్టర్ అభివృద్ధితోపాటు రాష్ట్రంలో నాణ్యమైన మామిడిపండ్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యానవన శాఖ, జాతీయ ఉద్యానవన బోర్డు అధికారులు కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని దినేష్ కుమార్ ఆదేశించారు.

అంతకు ముందు, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రసిద్ధి గాంచిందని అక్కడ 6 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించగా 8వేల మంది రైతులు వాటిని పండిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుండి మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లకు ఎగుమతి చేయడం జరుగుతోందని తెలిపారు.10 వేల ఎకరాల్లో సేంద్రీయ విధానంలో పండ్ల తోటల సాగు చేపట్టారని, మరో 7 వేల 500 ఎకరాల్లో ఈ విధానాన్ని ఈ ఏడాది చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

జాతీయ హార్టీ కల్చర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అరిజ్ అహ్మద్ మాట్లాడుతూ, పండ్ల తోటల అభివృద్ధికి తగిన తోడ్పాటును అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని చెప్పారు. పండ్ల ఉత్పత్తులు నిల్వ చేసేందుకు తగిన స్టోరేజి గోదాములు నిర్మాణం, రైఫనింగ్ చాంబర్ల ఏర్పాటుకు తోడ్పాటును అందించడం జరుగుతోందని, ఇంకా వివిధ అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.

More Telugu News