Chandrababu: తక్షణం వారిని తొలగించండి.. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం!: సీఎంకు, స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ

  • సమావేశాలకు హాజరు కావాలని కోడెల విజ్ఞప్తి చేశారు
  • ఫిరాయింపు మంత్రులు, ఎమ్మెల్యేలను తొలగించండి
  • రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరవుతాం

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు.

‘అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోడెల శివప్రసాదు గారు చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభ నడుపుతున్న స్పీకరు గారు, వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకరు గారు.. ప్రజాస్వామ్య ధర్మపన్నాలు వల్లించటం చూసిన తరువాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం.

రేపటి నుంచి మీరు పెడుతున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరుకావటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే మీ ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజా స్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగసొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. మరోసారి చెపుతున్నాం. ఈ రోజే వారిని తొలగించండి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరవుతాం’ అంటూ ఆ లేఖలో వైసీపీ ఎమ్మెల్యేలు కండీషన్ పెట్టారు.

More Telugu News