Rahul Gandhi: మానస సరోవర యాత్రకు వెళుతూ రాహుల్ చికెన్ తిన్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన రెస్టారెంట్!

  • నేపాల్ లోని ఖాట్మాండులో ఘటన
  • ఆగస్టు 31న రెస్టారెంట్ కు వెళ్లిన రాహుల్
  • భోజనంపై వివరణ ఇచ్చిన యాజమాన్యం

కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం రాహుల్ కైలాస మానస సరోవర యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు బయలుదేరేముందు రాహుల్ మాంసాహారం తిన్నట్లు వార్తలు రావడంతో ఆయనపై అధికార బీజేపీ, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


మానస సరోవర యాత్రలో భాగంగా రాహుల్ ఆగస్ట్ 31న నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ‘వూటూ’ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఏం తిన్నారు? అన్న విషయమై స్థానిక మీడియా కూపీ లాగింది. దీంతో ఓ సర్వర్ మాట్లాడుతూ.. రెస్టారెంట్ లో రాహుల్ 9వ నంబర్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారనీ, చికెన్ కుర్ కురే ఆర్డర్ చేశారని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అక్కడి మీడియా ఈ విషయాన్ని పదేపదే ప్రసారం చేయడంతో పలువురు నెటిజన్లు, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పవిత్రమైన మానస సరోవర యాత్రకు వెళ్లేముందు మాంసాహారం తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


దీంతో ఈ వివాదంపై వూటూ రెస్టారెంట్ స్పందించింది. రాహుల్ తమ హోటల్ లో కేవలం శాకాహారం మాత్రమే తిన్నారని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తమ ఉద్యోగులు ఎవరూ మీడియాతో మాట్లాడలేదని తేల్చిచెప్పింది.

More Telugu News