YSRCP: మీ పిల్లలను వైసీపీకి దూరంగా ఉంచండి: ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

  • గుంటూరు సభ భగ్నం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నింది
  • నేర చరిత గల యువకులను సభకు పంపారు  
  • ఏదైనా ఘర్షణ జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు?

అరాచక రాజకీయాలు చేస్తున్న వైసీపీ కార్యాకలాపాల నుంచి తమ పిల్లలను దూరంగా ఉండేటట్లు చూడాలని తల్లిదండ్రులకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ విజ్ఞప్తి చేశారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందుకే ‘నారా హమారా...టీడీపీ హమారా’ కార్యక్రమాన్నిముస్లిం సమాజం విజయవంతం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా...టీడీపీ హమారా’ కార్యక్రమం విజయవంతమైందని, రాష్ట్రంలోని ముస్లిం సమాజమంతా ఏకతాటిపై నిలబడి, టీడీపీ వెనకే ఉందనే విషయం ఈ సభ ద్వారా రుజువైందని చెప్పారు.

వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి


ముస్లింల నుంచి వచ్చిన స్పందన చూసి, వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ముస్లింలను ఓటు బ్యాంకుగా వైసీపీ చూసిందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ మండిపడ్డారు. గుంటూరు సభను భగ్నం చేయడానికి వైసీపీ కుట్ర పన్నిందని, నేర చరిత్ర కలిగిన 8 మంది నంద్యాల యువకులను సభకు పంపించారని, చంద్రబాబు మాట్లాడే సమయంలో నినాదాలు చేసి, సభను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు.

లక్ష మందికి పైగా హాజరైన టీడీపీ కార్యకర్తలు ఎంతో సమన్వయంతో వ్యవహరించి, వారిని అక్కడి నుంచి పంపించి వేశారని, అక్కడ ఏమైనా ఘర్షణ జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో తునిలో కాపుల సభ జరుపుకుంటున్నప్పుడు, వైసీపీ కార్యకర్తలే రైలును తగులబెట్టారని ఎం.డి.హిదాయత్ ఆరోపించారు.

నాడు వైఎస్ కూడా ఇలాగే వ్యవహరించారు


జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే వ్యవహరించే వారని, హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించిన చరిత్ర ఆయనదని, వైసీపీ అరాచక రాజకీయాలకు పాల్పడుతోందని హిదాయత్ ఆరోపించారు. ఆ పార్టీ కార్యకలాపాలకు, సభకు తమ పిల్లలను దూరంగా పెట్టాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ‘నారా హమారా...టీడీపీ హమారా’ సభలో వైసీపీ కార్యకర్తలు చేసిన నినాదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగన్ ని ఆయన ప్రశ్నించారు.

 గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేకు అవకాశమిచ్చేవాళ్లం

ముస్లిం యువతను బలిపశువు చేయడానికి వైసీసీ నేతలు కుట్ర పన్నుతున్నారని, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ముస్లిం సామాజిక వర్గానికే చెందిన వారే ఉన్నారని, ఆయనే నేరుగా గుంటూరు సభకు వచ్చి మాట్లాడాలని అనుకుంటే తాము వీఐపీ పాస్ ఇచ్చే వారమని అన్నారు. వైసీసీ నేతలు నేరుగా వచ్చి సీఎం చంద్రబాబునాయుడుని ప్రశ్నిస్తామంటే అవకాశమిచ్చేవారమని, అసెంబ్లీ, పార్లమెంట్ నుంచి పారిపోయిన వారికి సభలో మాట్లాడే దమ్ము ఎక్కడుందని ఎద్దేవా చేశారు.  

  • Loading...

More Telugu News