Lover: ప్రియుడి మోజులో పడి, ఇద్దరు బిడ్డలను చంపిన అభిరామి అరెస్ట్!

  • ప్రియుడిని విచారిస్తుండగా ఫోన్ చేసిన అభిరామి
  • ప్లాన్ చేసి నాగర్ కోవిల్ లో అరెస్ట్
  • చెన్నైకి తీసుకు వచ్చి రహస్యంగా విచారణ

ఓ దుకాణం ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్తను, బిడ్డలనూ హత్య చేయాలని ప్లాన్ చేసి, బిడ్డలను మాత్రమే చంపిన కసాయి తల్లి అభిరామిని నాగర్ కోవిల్ వద్ద తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తమిళనాడులో కలకలం సృష్టించగా, ఆమె ప్రియుడు సుందరం ఇచ్చిన సమాచారంతో అభిరామిని అరెస్ట్ చేశారు పోలీసులు. బిడ్డలను హత్య చేసిన తరువాత అభిరామిని తానే నాగర్ కోయిల్ బస్సు ఎక్కించానని సుందరం చెప్పగా, ఆ కోణంలో విచారించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

పిల్లలను హత్య చేసిన రోజు, భర్త ఆలస్యంగా ఇంటికి రావడమే అతని ప్రాణాలను కాపాడిందని, భర్త విజయ్ కుమార్ ను చంపేందుకు కూడా నిర్ణయించుకున్న ఆమె, పాలల్లో విషం కలిపి సిద్ధంగా ఉంచుకున్నప్పటికీ, విజయ్ కుమార్ రాలేదని, దీంతో తెల్లవారుజామున ఆమె ప్రియుడితో కలసి పారిపోయిందని పోలీసులు తెలిపారు.

తాము సుందరాన్ని విచారిస్తున్న సమయంలోనే అభిరామి నుంచి అతనికి ఫోన్ వచ్చిందని, ఆ తరువాత సుందరంతో ఆమెకు కాల్ చేయించి, నాగర్ కోవిల్ బస్టాండు వద్దకు రప్పించి అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం అభిరామిని చెన్నైకి తీసుకు వచ్చిన పోలీసులు, ఆమెను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు.

More Telugu News