Maharashtra: 'వంట' మనిషి ద్వారా మహిళ హత్యకు పథకం.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ఆమ్లెట్ లో ఎలుకల మందు కలిపిన వంటవాడు
  • ఆసుపత్రిలో చేరిన బాధితురాలు
  • వైద్య పరీక్షల్లో రక్తంలో విషం ఉన్నట్లు వెల్లడి

మానవ సంబంధాలపై నమ్మకం కోల్పోయే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న వంటవాడిని ప్రలోభపెట్టిన బంధువులు ఎలుకల మందుతో సదరు మహిళను హత్య చేసేందుకు యత్నించారు. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వంటవాడిని అరెస్ట్ చేశారు.

పార్సీ మహిళ జీనియా ఖజోటియా(65) సింగపూర్ నుంచి వచ్చి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఆమె ఇంట్లోనే రియాజుల్ హక్ అనే వంట మనిషి కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అతను వేసిన ఆమ్లెట్ తిన్న ఖజోటియాకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో ఆమె హుటాహుటిన ఆసుపత్రిలో చేరారు. చికిత్స చేసిన వైద్యులు ఆమె రక్తంలో ఎలుకల మందు అవశేషాలను కనుగొన్నారు. దీంతో తిన్న ఆమ్లెట్ శాంపిల్ ను పరీక్షించగా థాలియం అనే ఎలుకల మందు ఉన్నట్లు తేలింది.

దీంతో సదరు వంటవాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఖజోటియా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇతని ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటన వెనుక ఇంకా ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, గత కొన్నిరోజులుగా భోజనం తిన్న ప్రతిసారీ తీవ్ర అసౌకర్యంగా అనిపించేదని బాధితురాలు ఖజోటియా తెలిపింది. తన తల్లిని కూడా ఇలాగే విషమిచ్చి చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.

More Telugu News