Hyderabad: ప్రియురాలి కోసం విజయవాడ నుంచి బ్యాచ్ తో వచ్చిన యువకుడు... బంజారాహిల్స్ లో వీరంగం!

  • బీటెక్ చదివేరోజుల్లో యువతితో ప్రేమ
  • మరొకరికి సన్నిహితంగా ఉంటోందని గొడవకు వచ్చిన యువకుడు
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

తనను ప్రేమించి, ఇప్పుడు మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపిస్తూ, విజయవాడ నుంచి తన స్నేహితులను వెంటేసుకుని వచ్చిన ఓ యువకుడు, హైదరాబాద్, బంజారాహిల్స్ లో వీరంగం సృష్టించగా, పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయవాడ, మాచవరంకు చెందిన రేవంత్ (26), బీటెక్ చదువుతున్నప్పుడు, గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె (25)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, రేవంత్ మరో మహిళకు దగ్గరయ్యాడన్న విషయం తెలుసుకున్న యువతి, అతన్ని వదిలించుకుని హైదరాబాద్ కు వచ్చి, బంజారాహిల్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న అఖిల్ అనే యువకుడితో ఉంటోంది.

తాను ప్రేమించిన అమ్మాయి మరొకరికి దగ్గరైందన్న ఆగ్రహంతో ఉన్న రేవంత్, గత కొన్ని రోజులుగా, ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ, బెదిరిస్తున్నాడు. ఆమెను విజయవాడ పంపాలని అఖిల్ నూ హెచ్చరించాడు. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున 10 మంది స్నేహితులను వెంటేసుకుని విజయవాడ నుంచి వచ్చిన రేవంత్, అఖిల్ తో గొడవపడ్డాడు. అఖిల్ స్నేహితులు కూడా రావడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రేవంత్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాను ఐఈఎల్టీఎస్ కు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ లో ఉంటున్నానని చెబుతూ, సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు తెలిపారు. 

More Telugu News