Chandrababu: వైసీపీ కుట్రల ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే: సీఎం చంద్రబాబు

  • పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ముస్లింలపైకి నెట్టారు
  • ‘నారా హమరా..’ సభలోనూ అల్లర్లు సృష్టించారు
  • వైసీపీ వ్యవహారశైలిపై మండిపడ్డ సీఎం చంద్రబాబు

గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ముస్లింలపైకి నెట్టారని, ‘నారా హమరా-టీడీపీ హమారా’ సభలో కూడా అల్లర్లు సృష్టించి అమాయకులైన ముస్లింలను కేసులలో ఇరికించడం వైసీపీ నేరప్రవృత్తికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజావేదికలో పార్టీ ముఖ్యనేతలతో సీఎం ఈ రోజు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షం తీరును ఎండగట్టారు. వైసీపీ కుట్రల ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందేనన్న ఆయన, రాజధానిలో చెరకు, అరటితోటలు తగులబెట్టి ఆ నిందను రైతులపైకి వేశారని, తునిలో రైలు దహనం చేసి ఆ నేరం అమాయకులైన కాపుల పైకి నెట్టాలని చూశారని అన్నారు. ముస్లింలంతా టీడీపీ వైపు మళ్లటాన్ని చూసి ప్రతిపక్షం తట్టుకోలేకపోతోందని, ఏదో విధంగా రెచ్చగొట్టి అశాంతి సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని వైసీపీ వ్యవహారశైలిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి జగన్ తగడని, రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పెడధోరణులన్నీ వైసీపీ ఆవిర్భావం తర్వాతే జరుగుతున్నాయని, టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ నేతలకు సూచించారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను కేవలం యాభై నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డుగా చంద్రబాబు అభివర్ణించారు.

More Telugu News