Chandrababu: ఆయన చంద్రబాబు నాయుడు కాదు ‘ఎర్ర నాయుడు’!: వైసీపీ నేత భూమన విమర్శలు

  • చంద్రబాబు పాలనలో స్మగ్లర్లు పెరిగిపోతున్నారు
  • అటవీ సంపదను ‘పచ్చదండు’ దోచుకుంటోంది
  • వచ్చే ఎన్నికలలో పచ్చ చొక్కాలకు ఇంధనం ఎర్ర చందనమే!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో స్మగ్లర్లు పెరిగిపోతున్నారని, ఎర్ర చందనం తరిగిపోతోందని ఆరోపించారు. కోట్ల విలువైన ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారని, నాలుగున్నరేళ్లగా అటవీ సంపదను ‘పచ్చదండు’ దోచుకుంటొోందని టీడీపీ నేతలపై ఆయన ఆరోపణలు గుప్పించారు.

 ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికడతామని చెప్పిన చంద్రబాబు, అసలు ఎర్ర చందనమే లేకుండా దోచేస్తున్నారని ఆరోపించారు. నటనలో నందమూరిని, నాటకాల్లో నాగభూషణాన్ని, కథలు చెప్పడంలో పిట్టల దొరను చంద్రబాబు మించిపోయారని వ్యాఖ్యానించారు. ఆయన నారా చంద్రబాబునాయుడు కాదు ‘ఎర్ర నాయుడు’ అని ఆరోపించారు. 

వచ్చే ఎన్నికలలో పచ్చ చొక్కాలకు ఇంధనం ఎర్ర చందనమేనని, ఎర్రచందనం నాణ్యతను తగ్గించి చూపుతున్నారని, వేలం పాటలో ఎర్ర చందనం దుంగలను చౌక ధరకు పాడుకుని ఇతర దేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ‘సీ’ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను ‘ఏ’ గ్రేడ్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎర్ర చందనం తరలిపోకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వట్టి బూటకమని, వారికి తుప్పుపట్టిన తుపాకులిస్తే కూంబింగ్ నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 

More Telugu News