High Court: ప్రగతి నివేదన సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు!

  • శ్రీధర్ పూజారి పిటిషన్ కొట్టివేత
  • తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్న టీఆర్ఎస్ లాయర్లు
  • సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లాలో జరగనున్న సభ

రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ వద్ద వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభ కారణంగా 1600 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారనీ, వెంటనే ఈ సభకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ఈ రోజు కొట్టివేసింది. గత నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ సభను నిర్వహిస్తోంది.

నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ సభ కోసం 25 లక్షల మందిని సమీకరిస్తున్నారనీ, లక్ష వాహనాలను వాడుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దాదాపు 1600 ఎకరాలను చదునుచేస్తూ అక్కడి చెట్లను నరికేస్తున్నారని వెల్లడించారు. అయితే పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రగతి నివేదన సభకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

More Telugu News