Nagarjuna sagar: నాగార్జున సాగర్ గేట్లు తెరుస్తున్నాం... అలర్ట్ జారీ!

  • 586 అడుగులకు చేరిన నీటి మట్టం
  • ఎగువ నుంచి వస్తున్న భారీ వరద
  • ముంపు ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ

590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న నాగార్జున సాగర్ లో ఈ మధ్యాహ్నం 586 అడుగులకు నీరు చేరడంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నామని అధికారులు ప్రకటించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న నల్గొండ, సూర్యాపేట, గుంటూరు జిల్లాల ముంపు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, ఎగువ నుంచి భారీ వరద రానుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సాగర్ డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారగా, చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సాగర్ కు 75 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, నారాయణపూర్ నుంచి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ఆ నీరు ఈ సాయంత్రం శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుందని అంచనా. ఆ వెంటనే మరోసారి శ్రీశైలం గేట్లను అధికారులు తెరవనున్నారు. శ్రీశైలం వరద సాగర్ ను చేరేలోపే సాగర్ గేట్లను తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.

More Telugu News