Hyderabad: స్నేహితుడి కోసం త్యాగం... తనకెంతో ఇష్టమైన 'ఆహ్వానం' హోటల్ ను రెండు నెలల క్రితమే లీజుకిచ్చిన హరికృష్ణ!

  • ఆహ్వానం హోటలంటే హరికృష్ణకు ఎంతో ఇష్టం
  • ఆర్థిక కష్టాల్లో ఉన్న కృష్ణారావుకు అద్దెకిచ్చిన హరికృష్ణ
  • హోటల్ ను నడిపించుకుంటే కష్టం తీరుతుందని భరోసా

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అబిడ్స్ లోని ఆహ్వానం హోటల్... రామకృష్ణ థియేటర్లు, హోటల్ కలిసుండే ఈ ప్రాంగణమంటే నందమూరి హరికృష్ణకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆహ్వానం హోటల్ నిర్వహణను హరికృష్ణ స్వయంగా చూసుకునేవారు. ఈ హోటల్ లో ఆయనకు ప్రత్యేక రూమ్ ఉండేది. హైదరాబాద్ లో ఉంటే, నిత్యమూ ఇక్కడికి రాకుండా ఉండరాయన. అటువంటి తనకెంతో ఇష్టమైన హోటల్ ను స్నేహితుడి కోసం రెండు నెలల క్రితం త్యాగం చేశారాయన.

పలు వ్యాపారాలు చేసి, నష్టపోయిన తన స్నేహితుడు కృష్ణారావును పిలిచిన హరికృష్ణ, ఆయనకు ఆహ్వానం హోటల్ ను అద్దెకిచ్చి, ఆర్థికంగా కుదురుకోవాలని సూచించారు. తన ఇంటికి కృష్ణారావును పిలిపించిన హరికృష్ణ, బాధపడవద్దని, పరిస్థితులు సర్దుకుంటాయని ధైర్యం చెప్పారు. ఆహ్వానం హోటల్ ను నడిపించుకోవాలని సూచించారు. హోటల్ చక్కగా నడుస్తోందని, నీ కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు.

ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న కృష్ణారావు, కావలికి వెళుతున్నట్టు మంగళవారం రాత్రి చెప్పిన ఆయన, తాను తిరిగి రావడం ఆలస్యం కావచ్చని, తన కోసం ఎదురు చూడవద్దని అన్నారట. ఆయన తనతో చెప్పిన చివరి మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయని బోరున విలపిస్తూ గుర్తు చేసుకున్నారు కృష్ణారావు.

More Telugu News