BSNL Wings: టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ నయా సంచలనం.. మూడు ప్లాన్లు ప్రకటించిన టెల్కో

  • దేశంలోనే తొలిసారి ఇంటర్నెట్ కాలింగ్ సేవలు
  • ఆఫర్లు వెల్లడించిన ప్రభుత్వ రంగ సంస్థ
  • ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్లాన్లు

టెలికం రంగంలో ప్రవేటు సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో ముందుకొస్తున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా దేశంలోనే తొలిసారిగా ‘వింగ్స్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోటీ సంస్థల కంటే ముందే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్ టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.

సాధారణంగా మొబైల్‌లో సిమ్‌కార్డు ఉంటేనే కాల్స్ చేసుకోవడం వీలవుతుంది. అయితే, బీఎస్ఎన్ఎల్ ‘వింగ్స్’ పథకంలో సిమ్‌తో పనిలేదు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే దేశంలోని ఏ నంబరుకైనా ఫోన్ చేసుకోవచ్చు. వింగ్స్ సేవల కోసం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు సిప్ (సెషన్ ఇనిషియేషన్ ప్రొటోకాల్) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌కు బ్యాక్ ఎండ్‌గా ఇది పనిచేస్తుంది. వింగ్స్ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ ఓ నంబరును వినియోగదారుడికి కేటాయిస్తుంది.

ఈ పథకంలో భాగంగా సంస్థ మూడు ఆఫర్లను ప్రవేశపెట్టింది. సాధారణ వినియోగదారులు ఏడాదికి రూ.1099 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీనికి జీఎస్టీ అదనం. ల్యాండ్‌ఫోన్ వినియోగదారులకు ఈ ఆఫర్‌ మరో రెండు నెలలు అదనంగా లభిస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏడాదికి రూ.599 ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. విద్యార్థులు కూడా ఇదే ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

More Telugu News