Vijayawada: అనారోగ్యాన్ని దాచిపెట్టిన భార్యపై కక్ష.. నగ్నచిత్రాలు పంపి భర్త వికృతానందం!

  • భార్యకు వాట్సాప్‌లో అసభ్య సందేశాలు, ఫొటోలు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

అనారోగ్యాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందన్న కోపంతో భార్యపైనే కక్ష పెంచుకున్నాడో ప్రబుద్ధుడు. తనకెటువంటి అనారోగ్యం లేదని మొత్తుకుంటున్నా వినకుండా వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకర సందేశాలను, తన నగ్న చిత్రాలను భార్యకు వాట్సాప్‌లో పంపిస్తూ ఆమెను మానసికంగా వేధించసాగాడు. భర్త వేధింపులు ఇక భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించగా, వారతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

విజయవాడలోని కొత్తపేటకు చెందిన కొత్త నాగశ్రీనివాస కల్యాణ్‌ చక్రవర్తి(33) ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత భార్యకు నరాల సంబంధిత వ్యాధి ఉందని, ఆ విషయాన్ని తనకు చెప్పకుండా పెళ్లి చేశారని కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించడంతో తనకు ఎటువంటి జబ్బు లేదని ఆమె తేల్చి చెప్పింది. అయినా వినని కల్యాణ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇక భార్యపై విపరీతంగా కక్ష పెంచుకున్న కల్యాణ్ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త టార్చర్ భరించలేని ఆమె  పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదంటూ జూలైలో విజయవాడ కుటుంబ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ప్రతిగా, భర్త తనను హింసిస్తున్నాడంటూ బాధితురాలు ఎల్‌బీనగర్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న కల్యాణ్ వాట్సాప్‌లో ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు, తన నగ్నచిత్రాలు పంపడం మొదలుపెట్టి హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపించారు.

More Telugu News