kcr: సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కేసీఆర్.. సెప్టెంబర్ 2 తర్వాత అసెంబ్లీ రద్దు?

  • ముందస్తుకు రంగం సిద్ధం చేసిన కేసీఆర్
  • రేపు కేబినెట్ భేటీ
  • భవిష్యత్ కార్యాచరణను వివరించనున్న ముఖ్యమంత్రి

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకోనున్నారు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించనున్నారు.

సెప్టెంబర్ 2న జరగనున్న ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఎన్నికలకు ముందే తమ బలమెంతో విపక్షాలకు చూపించే యోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ సభ తర్వాత చివరి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ రద్దును కేసీఆర్ ప్రకటించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ రద్దు తీర్మానం కోసం కేబినెట్ మరోసారి భేటీ అవుతుంది.  

More Telugu News