Salman Khan: సల్మాన్ భారీ విరాళం ఇచ్చాడన్న జావేద్ జాఫ్రీ.. ట్రాష్ అంటున్న నెటిజన్లు!

  • 'కేరళకు రూ. 12 కోట్ల విరాళం ప్రకటించిన సల్మాన్' అంటూ జావెద్ జాఫ్రీ ట్వీట్
  • వాస్తవం కాదంటూ నెటిజన్ల ట్వీట్లు 
  • క్లారిటీ వచ్చేంత వరకు ట్వీట్ వెనక్కి తీసుకుంటున్నానన్న జావెద్

భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తూ, కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 12 కోట్లు విరాళం ప్రకటించాడనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'కేరళ కోసం సల్మాన్ రూ. 12 కోట్లు ప్రకటించినట్టు విన్నా. సల్లూకు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్' అంటూ జావెద్ ట్వీట్ చేశాడు.

అయితే, ఈ వార్త నిజం కాదంటూ నెటిజన్లు వరుసగా ట్వీట్లు చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానంగా, 'సల్మాన్ లాంటి సూపర్ స్టార్ కు అంత మొత్తం విరాళం ఇచ్చేంత స్థాయి ఉంది. సల్మాన్ విరాళం ప్రకటించాడని నేను చెప్పలేదు. ఆ వార్తలు విన్నానని మాత్రమే చెప్పా. ఈ విషయాన్ని నేను నిర్ధారించుకునేంత వరకు నా ట్వీట్ ను వెనక్కి తీసుకుంటున్నా' అంటూ మరో ట్వీట్ చేశాడు. 

More Telugu News