renuka chowdary: నా నవ్వుతో మోదీ మనసు చివుక్కుమంది: రేణుకాచౌదరి

  • ఆధార్ కార్డును తనే ప్రవేశపెట్టినట్టు మోదీ చెప్పుకున్నారు
  • అందుకే నేను నవ్వాను
  • ఇకపై కూడా నేను నవ్వుతూనే ఉంటా

గతంలో జరిగిన పార్లమెంటు సమావేశాల సమయంలో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి నవ్వు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో తన ప్రసంగం సమయంలో ఆధార్ గురించి ప్రధాని వివరణ ఇస్తున్న సమయంలో రేణుక గట్టిగా నవ్వారు. దీంతో, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కల్పించుకుని 'ఏమైంది మీకు... ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లండి' అంటూ అసహనం వ్యక్తం చేశారు.

అయితే, వెంకయ్య ఇంకా మాట్లాడుతుండగానే మోదీ కల్పించుకుని, 'రేణుక గారిని ఏమీ అనకండి అధ్యక్షా... రామాయణం సీరియల్ తర్వాత అలాంటి నవ్వును మళ్లీ చూసే అవకాశం ఇప్పుడు కలిగింది' అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోదీ చుట్టూ ఉన్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ సభ్యులు బల్లలు చరుస్తూ, గట్టిగా నవ్వారు.

ఈ ఘటనపై ఓ తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రేణుక స్పందిస్తూ, అప్పటి ఘటనకు సంబంధించిన వీడియోను చూడండి, మోదీ చుట్టూ ఉన్న కేంద్ర మంత్రులంతా ఆత్మాభిమానాన్ని చంపుకుని, మోదీ మెప్పుకోసం బల్ల చరుస్తున్న సంగతి అర్థమవుతుందని... వీరంతా మగాళ్లా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డును తానే ప్రవేశపెట్టినట్టు మోదీ చెప్పుకున్నారని... అందుకే తాను నవ్వానని... తన నవ్వుతో ఆయన మనసు చివుక్కుమందని చెప్పారు. ఇకపై కూడా తాను నవ్వుతూనే ఉంటానని చెప్పారు. 

More Telugu News