KTR: సెప్టెంబర్ 2న దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దు!: ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

  • సెప్టెంబర్ 2 ఆదివారం
  • కావాలనే ఆరోజున సభ ఏర్పాటు చేశాం
  • ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను మేమే బుక్ చేసుకుంటాం

టీఆర్ఎస్ పార్టీ  ప్రగతి నివేదన సభ సెప్టెంబర్ 2న నిర్వహించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ శివారు కొంగరకలాన్ లో ఈ సభ నిర్వహించనున్నారు. సభా ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సెప్టెంబర్ 2 ఆదివారం. కావాలనే ఆరోజున సభ ఏర్పాటు చేశాం. ఎందుకంటే, ఆ రోజున కార్యాలయాలు, పిల్లలకు స్కూళ్లు ఉండవు... ఇంకా ఇతర ఇబ్బందులు కూడా ఉండవు.

ఆ రోజున అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను వినియోగించుకుంటాం. ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ప్రజలు సురక్షితంగా తరలి రావాలంటే ఆ రోజున ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను పార్టీ పరంగా మేమే బుక్ చేసుకుంటాం. ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. సెప్టెంబర్ 2 నాడు దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ ఒక్కరోజు జరిగే అసౌకర్యానికి ప్రజలు మన్నించి మాకు సహకరించాలని పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News