JAGAPATIBABAU: జగపతిబాబు జీవితంపై బయోపిక్.. సీరియల్ గా తెరకెక్కిస్తున్న నిర్మాతలు!

  • జీవితంలోని అన్ని కోణాల చిత్రీకరణ
  • షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు వార్తలు
  • ఇంకా స్పందించని చిత్ర బృందం

ప్రస్తుతం టాలీవుడ్ లో జగపతి బాబు బిజీ క్యారెక్టర్ నటుడిగా రాణిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఫ్యామిలీ హీరోగా మెప్పించిన ఆయన.. ఆ తర్వాత పరాజయాలను ఎదుర్కొన్నారు. అనంతరం లెజెండ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాదిలో రంగస్థలం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో జగపతిబాబు దూసుకుపోతున్నారు.

ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ జగపతిబాబు కెరీర్ పరంగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. తాజాగా జగపతి బాబు జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను బయోపిక్ గా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బయోపిక్ ను సినిమాగా కాకుండా సీరియల్ రూపంలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ బయోపిక్ ను  20 ఎపిసోడ్లలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయిందనీ, దీనికి ‘సముద్రం’ అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.  దీనికి సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

More Telugu News