Karnataka: కర్ణాటక మంత్రి మహేశ్ పై నిర్మలా సీతారామన్ గుస్సా.. తీవ్రంగా జవాబిచ్చిన మంత్రి!

  • కర్ణాటక కొడగు జిల్లాలో ఘటన
  • మీడియా సమావేశం సందర్భంగా వాగ్వాదం
  • మంత్రి మహేశ్ పై నిర్మల ఆగ్రహం

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక మంత్రి సారా మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశాన్ని త్వరగా ముగించాలని మహేశ్ తనను కోరడంపై మండిపడ్డారు. కొడగు జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోగా, భారీ ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆర్మీ చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు శుక్రవారం ఆమె కొడగుకు చేరుకున్నారు. జిల్లాలో బాధితులను సీతారామన్ పరామర్శించారు.

అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీతారామన్ మాట్లాడుతుండగా కొద్దిసేపటి తర్వాత మంత్రి మహేశ్ బీజీ షెడ్యూల్ కారణంగా మీడియా సమావేశాన్ని త్వరగా ముగించాలని సూచించారు. దీంతో సహనం కోల్పోయిన ఆమె.. ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీరు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోంది. ఇది నమ్మశక్యంగా లేదు’ అంటూ కోపాన్ని ప్రదర్శించారు. తాను అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఏదేమైనా సమస్యను పరిష్కరించాలని కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీవిద్యను మంత్రి ఆదేశించారు. అదే సమయంలో మైకులో మాట్లాడాలని మీడియా కోరగా ‘మీకు కావలసింది రికార్డు చేసుకోండి’ అంటూ జవాబిచ్చారు.

అంతేకాకుండా ఓ వ్యక్తి(మహేశ్) కారణంగా సమావేశం గదిలోని అందరినీ బాధపెట్టాలని తాను అనుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా మహేశ్, మంత్రికి స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘సీతారామన్ తమిళనాడులో పుట్టారు. ఆంధ్రుడిని పెళ్లాడారు. కర్ణాటక రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News