Andhra Pradesh: అమరావతి బాండ్ల నిర్వాకం గురించి ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా?: చంద్రబాబుకి కన్నా ప్రశ్న

  • ప్రతీ వారం చంద్రబాబుకి 5 ప్రశ్నలు
  • తాజాగా మరో 5 ప్రశ్నలు సంధించిన కన్నా
  •  సమాధానం చెప్పగలరా?.. అంటూ నిలదీత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ వారం 5 ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా చంద్రబాబుకి 5 ప్రశ్నలు సంధించారు. తాను అడిగే ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పగలరా?.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

కన్నా అడిగిన ప్రశ్నలు:

  • షెడ్యూల్డు కులాల సంక్షేమానికి, వికాసానికి వినియోగించాల్సిన నిధులను మీ ప్రచార పథకాలకు మళ్ళించి, షెడ్యూల్డు కులాల వారికి ద్రోహం చేయడం లేదా?
  • రాష్ట్రంలో ఖనిజ సంపదను మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చట్ట విరుద్ధంగా దోచుకుంటున్న మాట వాస్తవం కాదా?
  • మీ పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, కమిషన్లు కొట్టేయడానికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల్లో పనులకు నామినేషన్ పద్ధతిని ఉపయోగించుకోవడం లేదా?
  • స్విస్ ఛాలెంజ్ పద్ధతిని వక్రీకరించి, అమరావతి రాజధాని ప్రాంతంలో వారికి ఎటువంటి బాధ్యత లేకుండా సీడ్ కాపిటల్ ఏరియాను అప్పగించడంలో అంతరార్థం ఏంటీ?
  • అమరావతి బాండ్ల నిర్వాకం గురించి ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా? అధిక వడ్డీ రేట్లను, బాండ్లను ఎందుకు జారీ చేశారో వివరించగలరా? రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి ఎందుకు నెడుతున్నారు?

More Telugu News