Chandrababu: అమరావతికి వచ్చిన రాందేవ్ బాబా... చంద్రబాబుపై పొగడ్తల వర్షం!

  • చంద్రబాబు ఓ మంచి నేత
  • అభివృద్ధి దిశగా దూసుకెళుతున్న ఏపీ
  • త్వరలో దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాలు
  • యోగా గురువుల శిక్షణ నిమిత్తం వచ్చిన రాందేవ్ బాబా

ఓ మంచి నాయకుడైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకు వెళుతోందని యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అమరావతిలో యోగా గురువుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అభిమానులు, తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, ఆయనతో ప్రేమ పూర్వక సంబంధాలున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యమూ శ్రమించే చంద్రబాబంటే తనకెంతో ఇష్టమని పొగడ్తల వర్షం కురిపించారు.

కేరళ వరద బాధితుల కోసం రూ. 2 కోట్లను సాయం చేశామని చెప్పారు. యోగా గురువులకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. పతంజలి సంస్థ తరఫున, వచ్చే రెండు నెలల కాలంలో దేశంలో 20 వేల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపనున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఏపీలో 1000 ఉద్యోగాలు ఉంటాయని రాందేవ్ బాబా చెప్పారు. నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని దేశం నుంచి పారద్రోలాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. కింభో యాప్, వాట్స్ యాప్ ను అధిగమిస్తుందని, త్వరలో పతంజలి సిమ్ కార్డులనూ విడుదల చేస్తామని అన్నారు.

More Telugu News