Biggboss: బిగ్ బాస్ లో రంగమ్మత్త సందడే సందడి!

  • ‘బిగ్‌బాస్‌’లో హాట్‌ యాంకర్‌ అనసూయ
  •  పెళ్లి వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరు
  • వధువు తరపు వారితో సందడి చేసిన రంగమ్మత్త

'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన యాంకర్‌ అనసూయ బిగ్‌బాస్‌లో సందడి చేసింది. మా టీవీలో ప్రసారమవుతున్న ఈ రియాల్టీ షోలో మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు అనసూయ అతిథిగా హాజరయింది.  గ్రీన్‌ కలర్‌ శారీతో ప్రేక్షకులతోపాటు బిగ్‌హౌస్‌ సభ్యుల మనసులు కొల్లగొట్టింది. 73వ ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌హౌస్‌ని పెళ్లి ఇల్లుగా మార్చేశారు. రాధాకృష్ణ, మధులత గ్రూప్‌ లు వధూవరుల తరపున ప్రాతినిధ్యం వహించగా మంగళవారం మెహందీ కార్యరక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాట్‌ యాంకర్‌ అనసూయ హాజరుకావడం మరింత ‘షో’ చేకూరింది. పురోహితుడుగా గణేష్‌ వ్యవహరించారు. టాస్క్‌లో భాగంగా పలు ఆటల పోటీలు  నిర్వహించి బహుమతులు అందజేశారు. తొలుత బిగ్‌బాస్‌ అబ్బాయి తరపున వాళ్లకు టాస్క్‌ ఇచ్చారు. స్విమ్మింగ్‌ పూల్‌లో ఉంగరాలు వెతికితీయాలన్నారు. సామ్రాట్‌, దీప్తిలు ఈ టాస్క్‌ పూర్తి చేశారు.

అమ్మాయి తరపు వాళ్లకు హౌస్‌లో దాచిన చెప్పుల జతను కనుక్కొని తేవాలని టాస్క్‌ ఇచ్చారు. అమిత్‌, గీతామాధురి, గణేష్‌, తనీష్‌, పూజా కష్టపడి 20 జతల చెప్పులు సేకరించారు. బహుమతులు గెల్చుకునేందుకు వధువు కుటుంబీకులు లడ్డూలు చుట్టాలని, వరుడు కుటుంబీకులు దుపట్టాలు సర్దాలని బిగ్‌బాస్‌ కోరాడు. దీంతో ఆయా గ్రూపుల టాస్క్‌తో బిజీగా ఉంటూనే తమ నామినేషన్‌ గురించీ చర్చించుకున్నారు.

ఇంట్లో ఓపక్క ఇలా హంగామా నడుస్తుండగా బిగ్‌హౌస్‌లో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ పాట వినిపించడంతో సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో అందరినీ పేరుపేరునా పలకరించింది. బిగ్‌బాస్‌కి మరింత శోభ చేకూర్చేందుకు వచ్చినట్లు చెప్పింది. వధూవరుల్లో ఎవరి తరపున ఉంటారని సభ్యులు ప్రశ్నించగా తనకు ఇద్దరూ కొడుకులే కావున వధువు తరపునే ఉంటానని చెప్పి నవ్వులు  పూయించింది. బుధవారం జరగనున్న సంగీత్‌, పెళ్లి వేడుకల్లో రంగమ్మత్త ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.

More Telugu News