Cricket: రికార్డులలో సచిన్ తో పోటీ పడుతున్న కోహ్లీ!

  • సచిన్‌ సెంచరీతో పోలిక 
  • ఇద్దరికీ 58‌వ టెస్ట్ మ్యాచ్ 
  • బంతులు, పరుగులు కూడా సమానమే 

క్రికెట్‌లో ‘విరాట్‌’ పర్వం మొదలయిందా... అంటే అవునంటున్నారు క్రికెట్‌ పండితులు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. విరాట్‌ బ్యాట్‌ జోరు గురించి తెలిసిన వారెవరికైనా ఇదేమంత విశేషంగా అనిపించదు. కానీ, 17 ఏళ్ల క్రితం క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్ ఇదే ఇంగ్లండ్‌ జట్టుపై సాధించిన సెంచరీతో దీనికి ఎన్నో పోలికలుండడమే ఆ విశేషం.

కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 58వ సెంచరీ. అప్పట్లో సచిన్‌కీ అంతే. అప్పుడు సచిన్‌ సాధించిన పరుగులు, అందుకు వినియోగించిన బంతులు, ఇప్పుడు కోహ్లీ సాధించిన పరుగులు, వినియోగించిన బంతులు 103, 197 కావడం మరో విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే, అప్పుడు ఇంగ్లండ్‌పై సెంచరీ సాధించినప్పుడు సచిన్‌ టెండూల్కర్ వయసు 28 అయితే, ఇప్పుడు కోహ్లీ వయసు 29.. కాకతాళీయం అంటే ఇదేనేమో!

క్రికెట్‌లో ఏ రికార్డు శాశ్వతం కాదు. ఇది ఎన్నోసార్లు నిరూపితమయింది. ఒకరిని మించిన ప్రతిభావంతులు మరొకరు వస్తూనే ఉంటారు. రికార్డులను తిరగ రాస్తారు. దీంతో పాతవి చరిత్రగా మిగిలిపోతాయి. గతంలో సంచలన రికార్డనుకున్న వాటిని లిటిల్‌ మాస్టర్‌ చెరిపేశాడు. ఇప్పుడు విరాట్‌ సమయం వచ్చింది. మాస్టర్‌ రికార్డును వేటాడే పనిలో పడ్డాడీ టీమిండియా కెప్టెన్‌ అన్నట్లుంది అతని జోరు. ప్రస్తుతం కోహ్లీ ఆటతీరు చూస్తుంటే పరుగులు, సెంచరీల్లో ఏదో ఒకరోజు రికార్డు బద్దలు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు క్రికెట్‌ పండితులు.  

More Telugu News