Chandrababu: 23 ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు... చంద్రబాబు చేసిన దుర్మార్గం: భూమన కరుణాకరరెడ్డి

  • 1995, ఆగస్టు 21న ఎన్టీఆర్ కు వెన్నుపోటు
  • అప్పటి నుంచి అబద్ధాలతో నెట్టుకొస్తున్న చంద్రబాబు
  • తప్పుడు గణాంకాలు చెబుతున్నారన్న భూమన

23 సంవత్సరాల క్రితం... 1995 ఆగస్టు 21వ తేదీన తనకు పిల్లనిచ్చిన మామ, నమ్మి పదవులు అప్పగించి, పెద్దపీట వేసిన అప్పటి సీఎం ఎన్టీ రామారావును, చంద్రబాబు దారుణమైన వెన్నుపోటు పొడిచి, అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, నాడు వైస్రాయ్ హోటల్ లో జరిగిన ఘటనలను తలచుకుంటే, ఇప్పటికీ బాధ కలుగుతోందని, అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ బంధు మిత్రులకు, టీడీపీ నేతలకు చెప్పిన అబద్ధాలను నేటికీ చంద్రబాబు కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలను వంచించి, మోసంతో అధికారాన్ని కైవసం చేసుకోవడం తెలుగు ప్రజల దురదృష్టమని భూమన అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ, ప్రజలు 80 శాతం తృప్తిగా ఉన్నారని అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. మిగతా రాష్ట్రాలకన్నా మిన్నగా, అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచామంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారని అన్నారు. తప్పుడు గణాంకాలు చూపిస్తూ, ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుందని జోస్యం చెప్పారు.

More Telugu News