Madhya Pradesh: లైంగిక వేధింపుల ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదని.. దళిత యువతి దారుణ హత్య!

  • మధ్యప్రదేశ్‌లోని సియోనీలో ఘటన
  • యువతి కాలేజీకి వెళ్తుండగా దాడి
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోలేదన్న కక్షతో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. యువతిని నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

దుండగుడి క్రూరత్వానికి బలైన యువతి (23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ బాలిక కళాశాలలో చదువుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం ఆమె కాలేజీకి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన నిందితుడు అనిల్ మిశ్రా (38) ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆమె జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఎంతమంది విడిపిస్తున్నా అతడు వినిపించుకోలేదు. అలా ఈడ్చుకెళ్లి పెద్ద బండరాయితో ఆమె తలపై మోదాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోనందుకే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించాడు.

More Telugu News