Jagan: జగన్‌కు బోల్డంత డబ్బు డొనేషన్ ఇచ్చా.. ఇక్కడ ఎలా గెలవాలో నాకు తెలుసు: కన్నబాబు రాజు

  • విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జగన్
  • నియోజక వర్గాల వారీగా విజయసాయి సమావేశాలు
  • ఎవరెన్ని చెప్పినా తన స్టైల్ మారదన్న కన్నబాబు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్ జగన్‌కు ఇచ్చానని, తానెవరిమాటా లెక్కచేయనని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరు ఎటువంటి వారో తనకు తెలుసని, ఎవరెన్ని చెప్పినా తన శైలి మాత్రం మారదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు తెలుసని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ప్రస్తుతం వైసీపీ చీఫ్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ, జగన్ పాదయాత్రపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం  యలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కన్నబాబుపై పలు ఆరోపణలు చేశారు. దీంతో, ఆ తర్వాత మైకందుకున్న కన్నబాబు మాట్లాడుతూ జగన్‌కు తాను బోల్డంత విరాళం ఇచ్చానని, తనను ఎవరూ అడ్డుకోలేరని చెప్పడంతో కలకలం రేగింది. ఇరు వర్గాల మద్దతుదారులు నినాదాలు చేసుకున్నారు.

More Telugu News