Congress: మణిశంకర్ అయ్యర్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన కాంగ్రెస్

  • మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్
  • వేటేసిన కాంగ్రెస్ చీఫ్
  • తొమ్మిది నెలల తర్వాత నిషేధం తొలగింపు

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై వేసిన సస్పెన్షన్ వేటును కాంగ్రెస్ ఎత్తివేసింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మణిశంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ‘నీచ్’ (నీచజాతికి చెందినవారు) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.

కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ నుంచి వచ్చిన సిఫార్సులను రాహుల్ గాంధీ అంగీకరించి మణిశంకర్ అయ్యర్‌పై విధించిన నిషేధాన్ని తొలగించారని ఆ పార్టీ సంస్థాగత అంశాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ తెలిపారు. కాగా, ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ తర్వాత తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు.

More Telugu News