jayalalitha: తమిళనాట ఊపందుకుంటున్న 'భారతరత్న' డిమాండ్!

  • జయకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే డిమాండ్
  • కరుణను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలంటున్న డీఎంకే
  • ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్న ఇరు పార్టీలు

తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయ విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు 1988లో మాజీ సీఎం, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్ కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్ల పట్ల కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. 

More Telugu News